Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 38

Story of Sagara !

With Sanskrit text in Telugu , Kannada and Devanagari,

తాం కథాం కౌశికో రామే నివేద్య కుశికాత్మజః |
పునరేవాపరం వాక్యం కాకుత్ స్థమ్ ఇదమబ్రవీత్ ||

తా|| ఆ కౌశికుడు రామునకు ఆ కథను నివేదించి , మళ్ళీ ఈ వాక్యములను ఆ కుశికాత్మజుడు ఆ కాకుత్థ్సునకు చెప్పెను.

బాలకాండ
ముప్పది ఎనిమిదవ సర్గము
( సగరుని కథ )

ఆ కౌశికుడు రామునకు ఆ కుమారస్వామి కథను నివేదించి , మళ్ళీ విశ్వామిత్రుడు ఆ శ్రీరామునకు సగరుని కథ చెప్పసాగెను.

' పూర్వము సగరుడు అనుపేరుగల ధర్మాత్ముడు, శూరుడు , నరులకు అధిపతి అయోధ్యకి రాజుగా ఉండెను. అతడు సంతానముమీద కోరికగలవాడు. సంతానము లేనివాడు. ఓ రామా ! కేశినీ అను పేరుగల వైదర్భి కన్య సగరునియొక్క జ్యేష్ఠ పత్నిగా ఉండెను. ఆమె ధర్మములలో నిష్ఠ కలది. సత్యవాదిని కూడా . సుమతి , అన్ని విషయములను ఎరిగినది , రూపములో భువిలో సాటిలేనిది , అరిష్టనేమీ అనబడు ఆవిడ సగరుని ద్వితీయ భార్".

'అప్పుడు ఆ రాజు పత్నులతో కలిసి హిమలయములలో భృగు ప్రస్రవణమునకు వచ్చి అ కొండపై తపస్సును ఆచరించెను. వారు అప్పుడు వంద సంవత్సరములు భృగు మహర్షిని ఆరాధించిరి. సత్యవంతులలో శ్రేష్ఠుడైన ఆ ముని సంతోష పడి ఆ సగరునికి ఈ విధముగా వరము ఇచ్చెను. "ఓ అనఘా ! నీకు చాలామంది పుత్రులు జన్మించెదరు. | ఓ ఫురుషర్షభా ! అప్రతిమైన కీర్తిని గూడా పొందెదవు . నాయనా ! ఒక భార్య వంశకరుడగు పుత్రునికి జన్మమిచ్చును. రెందవది అరువదివేల పుత్రులకు జన్మమిచ్చును".

'ఆ విధముగా చెప్పిన అ మహాత్ముని ప్రసన్నునిచేసుకొని, పరమప్రీతితో అంజలిఘటించి ఆ రాజపుత్రికలు అయిన కేశినీ సుమతీ ఇట్లు చెప్పిరి. "ఓ బ్రహ్మన్ ! ఎవరికి ఒకడే పుత్రుడు కలుగును ? ఎవరికి చాలామంది పుత్రులు కలుగుదురు . అది వినుటకు కోరిక గలవారము . మీ వచనములు సత్యమగుగాక". వారిద్దరి ఆ వచనములను విని పరమధార్మికుడైన భృగు ఇట్లు చెప్పెను. " ఇప్పుడు మీ కోరికను వివరించుదురుగాక. ఒకడు కీర్తిమంతుడు వంశోద్ధారకుడు అగును . లేక చాలామంది కీర్తిమంతులగు పుత్రులు కలుగుదురు , మీలో ఏవరికి ఎవరు కావలెనో కోరు కొనుడు."

విశ్వామిత్రుడు చెప్పసాగెను.

' ఓ రఘునందనా ! కేశినీ ఆ ముని వచనములను విని , ఆ రాజ సమక్షమములో వంశకరుడైన పుత్రుని కోరెను. అప్పుడు సుపర్ణ భగినీ అయిన సుమతి మహోత్సాహము కలవారు కీర్తిమంతులు అయిన అరవై వేలపుత్రులను కోరుకొనెను. ఓ రఘునందనా ! పిమ్మట ఆ రాజు భార్యలతోసహా శిరస్సుతో ప్రణామము చేసి , పిమ్మట ప్రదక్షిణము చేసి స్వపురమునకు వెళ్ళెను. కొంతకాలముతర్వాత జ్యేష్ఠా కేశినీ అసమంజ అను పేరుగల సగరాత్మజుడగు పుత్రుని కనెను. ఓ నరవ్యాఘ్రా ! సుమతికూడా సొరకాయవంటి గర్భపిండమును ప్రసవించెను. ఆ గర్భపిండమును భేదించిన పిమ్మట అరవై వేల పుత్రులు కలిగిరి అని వినడమైనది. ఆ దాదులు వారిని నేతితో నిండిన కుండలలో పెంచిరి. ఆందరూ కాలముతో వృద్ధిల్లి యౌవనము చేరిరి. చాలాకాలముతర్వాత సగరునియొక్క అరవై వేలపుత్రులు రూపముతో కూడి యౌవ్వనము పొందిరి'.

విశ్వామిత్రుడు చెప్పసాగెను.

' హే రఘునందనా ! నరశ్రేష్ఠా ! సగరునియొక్క జ్యేష్ఠ పుత్రుడు బాలులను తీసుకొని సరయూ నదీ జలములలో ముంచి , మునకలువేస్తున్న వారిని చూచి నవ్వుతో ఆనందించెడివాడు. ఈ విధముగా పౌరులకు హితము కాని పాపకర్మలను చేయుచున్న, సజ్జనులను బాధించుచున్న అ పుత్రుని పురమునుండి వేడలగొట్టబడెను. ఆ అసమంజసుని పుత్రుడు అంశుమాన్ అను పేరుగలవాడు , వీరుడు, లోకములలో అందరికీ సమ్మతమైన వాడు. అందరితో ప్రియముగా మాట్లాడువాడు'.

'ఓ నరశ్రేష్ఠా ! పిమ్మట కొంతకాలము తర్వాత సగరునియొక్క మతిలో యజ్ఞము చేయవలెనని కొరికకలిగెను. అట్లే నిశ్చయించుకొనెను. ఓ రామా ! అతడు అట్లు నిశ్చయించుకొని , గురువులతో అలాగే వేదజ్ఞులతో యజ్ఞకర్మచేయుటకు తయారు పడెను'.

||ఈ విధముగా శ్రీమద్రామాయణములోని బాలకాండలో ముప్పది ఎనిమిదవ సర్గ సమాప్తము ||

|| ఓమ్ తత్ సత్||

సకృత్వా నిశ్చయం రామ సోపాధ్యాయగణ స్తదా |
యజ్ఞకర్మణి వేదజ్ఞో యష్టుం సముపచక్రమే ||

తా|| ఓ రామా ! అతడు అట్లు నిశ్చయించుకొని , గురువులతో అలాగే వేదజ్ఞులతో యజ్ఞకర్మచేయుటకు తయారు పడెను.

|| ఓమ్ తత్ సత్ ||


|| Om tat sat ||